సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, జులై 2018, శనివారం

మనకు ఇంతమంది దేవతలెందుకు?


మనకు ఇంతమంది దేవ్వుళ్ళెందుకు? ఒక్క దేవుడినే ఆరాధిస్తే సరిపోదా? అని అప్పుడప్పుడు కొంతమంది నన్ను అడుగుతుంటారు. విషయం తెలుసుకోవాలంటే మన ఆధ్యాత్మిక విజ్ఞానంమీద కొంచెం లోతైన అవగాహన ఉండాలి. లేదంటే రహస్యం తెలుసుకోవడం కష్టం. రహస్యం తెలుసుకోవడానికి ఇక్కడ కొంచెం ప్రయత్నిద్దాం.

మన వేదాలు, శాస్త్రాలు బహ్వీశ్వరమును (పెక్కు దేవుళ్ళను) ఎన్నడూ ప్రతిపాదించలేదు. నిజానికి అవి దేవుడొక్కడే అదే పరబ్రహ్మము అని నొక్కి వక్కాణించాయి. ఓమితిబ్రహ్మ, ఓమితీదగ్ం సర్వం అని వేదమాట. ప్రణవమైన ఓంకారమే బ్రహ్మము, అదియే సర్వస్వము అని అర్ధము. శైవులు, శాక్తేయులు, వైష్ణవులు ఇలా రకరకాల ఆధ్యాత్మిక శాఖలు వారి వారి ఇష్టపూరితమైన దేవునిగా పరబ్రహ్మను భావించుకుంటారు. నిజానికి బ్రహ్మానికి రూపమేమీ లేదు. సర్వరూపములు అతని/ఆమెవే. సాధకుడు ఏ రూపమున ఆ పరబ్రహ్మమును భావించునో ఆ రూపమందే పరబ్రహ్మము ఆవిర్భవించును. ఉదాహరణకు, శ్రీమహావిష్ణువు ప్రహ్లాదునికి ఒకరకంగా, ధృవునికి ఇంకో రకంగా ఇలా రకరకాల దర్శనాలను తన భక్తులకు, శత్రువులకు కూడా ఇచ్చాడు. ఇంకా నయం ఆ అవతారాలన్నీ వేరువేరు దేవుళ్ళని పెద్దగా ఎవరూ ప్రచారంచేయలేదు. ఒక కుమ్మరివాడు మట్టితో ఎన్ని రకముల బొమ్మలను తయారుచేయునో, ఆవిధముగానే పరబ్రహ్మమును తెలుసుకున్న సాధకుడు తన ఇచ్ఛామాత్రమున తనకు కావలసిన మూర్తిని పూజించి ప్రత్యక్షము చేసుకొనుచున్నాడు. కనుకనే హిందూ శాస్త్రములందు పన్నెండు నెలలయందు ఏదో ఒక దేవతామూర్తిని నిర్మించుకొని పూజించడం కనిపిస్తున్నది. ఎంతో మంది మన ప్రాచీన సాధకులు ఆ పరబ్రహ్మమును వారి ఇచ్చాపూర్వకమగు ఎన్నో మూర్తులందు దర్శించి మనకు అందించారు. అందువలనే మనకు ఈరోజు ఎన్నో దేవతారాధనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి అధ్బుతమైన దర్శనాలు మరి ఏ ఇతర మతములందు కనిపించడంలేదు. అల్పబుద్ధికలవారికి ఈ విషయమునందు అల్పదృష్టి ఉండవచ్చునుకాని, మన ఋషులకు అలాలేదు. కనుకనే వారు బ్రహ్మమొక్కటే అని ఎలుగెత్తి చాటారు. ఈ విషయాలు అర్ధంచేసుకోక కొంతమంది మన పూజలను ఎగతాళి చేస్తుంటారు. మరీ ఖర్మమేమిటంటే, మన హిందూ ఔన్నత్యమును అర్ధం చేసుకోలేక కొంతమంది హిందువులే ఈవిధమైన బహీశ్వర వ్యర్ధవాదములు చేసుకొని కొట్టుకొంటున్నారు. బహుస్యాం ప్రజాయేయ (ఒక్కనేనే అనేకమగుదును) అని చెప్పిన ఆ ఈశ్వరుని తమయందును, విశ్వమందును, ప్రతిపరమాణువునందును నిర్వికారభావముతో దర్శించినటువంటి మహా పుణ్యాత్ములు నివసించిన ఈ కర్మభూమి యందు పుట్టిన కొంతమంది జనులనుండి ఇటువంటి మాటలు వినవలసి రావడం నిజంగా మన దురదృష్టం.

(నా పరమేష్టి గురువుగారు శ్రీఈశ్వరసత్యనారాయణ గారి ప్రవచన అధారంగా)

19, జూన్ 2018, మంగళవారం

దశమహావిద్యాస్తోత్రము

             -: మహాకాళీ:-
1 మహా గౌరి మహాకాళ ప్రియ సఖీ!"
   గౌరీ కౌశికీ నామ విఖ్యాతే మహాకాళీ     నమోస్తుతే ||

        -:తారాదేవీ:-
2 ముండమాలా విభూషితే నీలరూపిణీ!
   ఏకజటా నీలసరస్వతీ నామ విఖ్యాతే  తారాదేవీ నమోస్తుతే ||

         -: చిన్నమస్తా:-
3 రుథిరా పానప్రియే ఖండిత శిరో రూపిణీ!
   రక్తకేశి చిన్నబాలా నామ విఖ్యాతే  చిన్నమస్తా నమోస్తుతే ||

         -: షోడశీ:-
4 షోడశ కళాప్రపూర్ణే ఆద్యశక్తి రూపిణీ !
   శ్రీ విద్యా పంచవక్త్రా నామ విఖ్యాతే షోడశీ  నమోస్తుతే ||

           -:భువనేశ్వరీ:-
5 పాశాంకుశధరీ దుర్గమాసుర సం హారిణీ !
   శతాక్షరీ శాకంభరీనామ విఖ్యాతే  భువనేశ్వరీ నమోస్తుతే ||

     -:త్రిపురభైరవి:-
6 అరుణాంబరధారిణి ప్రణవరూపిణీ !
   యోగీశ్వరీ ఉమానామ విఖ్యాతే  త్రిపురభైరవీ నమోస్తుతే ||

        :-:ధూమవతీ:-
7 దుష్టాభి చారధ్వంసినీ కాకధ్వజ రథారూఢే!
   సుతరతామసీ నామవిఖ్యాతే ధూమావతీ నమోస్తుతే ||

           -:బగళాముఖి:-
8 పీతాంబరధారీ శత్రు భయ నివారిణీ !
   జ్వాలాముఖీ వైష్ణవీ నామ విఖ్యాతే బగళాముఖీ నమోస్తుతే ||

       -:మాతంగీ:-
9 అర్థచంద్ర ధారీ కదంబ వన వాసినీ !
   వాగ్దేవీసరస్వతీ నామవిఖ్యాతే విఖ్యాతే మాతంగీ నమోస్తుతే ||

         -:కమలాదేవీ:-
10 సువర్ణకాంతి సమన్వితే మహావిష్ణు   సహచారిణి !
     భార్గవీ మహాలక్ష్మీనామ విఖ్యాతే కమలా నమోస్తుతే ||

ఫలశృతి : దశమహావిద్యా స్తోత్రం సర్వ శత్రు,రోగ నివారణం !
సర్వ సంపత్కరం పుత్రపౌత్రాభివర్ధనం ||

దశమహావిద్యలలో కాళీ, తారా,చిన్నమస్తా, ధూమవతి, బగళాముఖి అనే ఐదు శక్తులు ఉగ్రస్వరూపంగాను మరియు షోడశి, భువనేశ్వరీ, త్రిపురభైరవి, మాతంగీ, కమలా అనే ఐదు శక్తులు సౌమ్యస్వరూపంగా గోచరిస్తాయి!!
అమ్మవారిని ఉగ్రరూపంగా కాకుండా సౌమ్య రూపంగానే ఆరాధించడం మేలు!!
 

దశమహావిద్యలను గురుముఖతః నేర్చుకోవాలి! కఠినమైన సాధనలు చేయాలి 
ఈ విద్యలు దేనికదే అత్యంత శక్తివంతమైనవి! శీఘ్రమైన ఫలితాన్నిస్తాయి!

14, జూన్ 2018, గురువారం

ధూమావతి

























జ్యేష్టశుద్ధ చతుర్ధి శ్రీధూమావతి ఉద్భవించినరోజు సందర్భంగా ఈ దేవతను మనం ఒకసారి స్మరించుకుందాం…

ఈమె దశమహావిద్యలలో ఒకదేవత. ఈమె రూపం కొంచెం తీవ్రంగా ఉంటుంది. వెలవెల బోయిన బూడిదరంగు శరీరం, మాసిన బట్టలు, విరబోసిన జుట్టు, వేలాడే స్తనాలు, క్రూరమైన చూపు, పొడుగాటి ముక్కు, బొట్టులేని నుదురు, ఆకలిగొన్నటు కనిపించేలా ఈదేవత ఆకారం ఉంటుంది. దేవతలలో విధవురాలుగా కనిపించే దేవత ఈమె ఒక్కతయే. ఈమె వాహనం కాకి. అయితే ఈమె రూపం సాధకులకు ఒక పాఠం నేర్పుతుంది. పైన మెరుగులతో కనిపించే అందం శాశ్వతంకాదు. సాధకులు అటువంటి అశాశ్వతమైన వాటిగురించి అర్రులుచాచకుండా తనలో తాను చూసుకొని శాశ్వతమైన జీవితసత్యాన్ని తెలుసుకోవాలని ఆమె రూపం తెలియపరుస్తుంది.

పార్వతికి ఆకలి అయినప్పుడు మహేశ్వరుని ఆహారం అడగ్గా అతను ఆలస్యం చేయడం వలన కోపమొచ్చి భవునిని మింగివేసినదట. అగ్నిరూపుడైన రుద్రుడు కడుపులో ఉండటం వలన ఆమె శరీరంపైనుండి పొగలు చిమ్మడంతో ఆమెను ధూమావతి అన్నారు. భర్తను మ్రింగివేసినది కనుక ఆమె విధవైనది. మరొక కధప్రకారం పార్వతి దక్షయజ్ఞంలో తనువులు బాసినప్పుడు ఆ హోమగుండం నుండి బూడిదరంగులో ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తియే ధూమావతి అని అంటారు.

ఎంతటివారినైనా ఉచ్ఛాటన చేయగల తీవ్రశక్తి ఆమె. ఈమెను సిద్ధులు ప్రసాదించే దేవతగా కొలుస్తారు. ఈమె ఉపాసనా ప్రయోగమును ప్రధానంగా శత్రువులను నిర్మూలించడానికి చేస్తారు. తనకు అనుకూలంగాలేని వారిని తన నుండి దూరంగా వెళ్ళగొట్టదలచినప్పుడు ఈ దేవతా ప్రయోగం చేస్తారు. ఈమె మహోన్నతమైన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఈమె సాధనలు రహస్యంగా శ్మశానంలోను, అడవిలోను జరుగుతుంటాయి.

ఈమెకు వృద్ధకాళి అని, ధూమ్రవారాహిఅని రూపాలుకూడా ఉన్నాయి.

(ఈ సంవత్సరం జూన్ 17వ తారీఖు ఆదివారం జ్యేష్ఠ శుక్ల చతుర్ధి)


11, జూన్ 2018, సోమవారం

శ్రీవిద్యోపాసన – 4


పూజాసంకేతం

పూజ అనగా నిరంతర ధ్యానము. అదియే సవికల్పసమాధి. ఆవాహన, ఆసన మొదలగు ఉపచారములకు సంబంధించిన క్రియా విధానమే పూజ అనబడును. నిజానికి జీవాత్మ, పరమాత్మ ఒక్కటే అన్న నిజము తెలుసుకోవడమే పూజయొక్క పరమ ప్రాముఖ్యత. సాధారణంగా మనం చేసే పూజల్లో దేవతా నామాలలో నమః అని చేర్చి అర్చించుతాము. ఉదాహరణకు, శ్రీమాత్రేనమః, ఓం గణపతయేనమః, శ్రీవిష్ణవేనమః ఇలా…. ఇందులో దేవతా నామము తత్ పదమును, నమః పదము త్వం పదమును సూచించును. ఈ రెండు పదముల కలయికే తత్వం. సాధన ఫలించినప్పుడు జీవాత్మ పరమాత్మలో కలుస్తుంది. అదే “అసి”. కనుక నామపూజయే మహావాక్యమైన తత్త్వమసి అవుతోంది. నామపూజకు ఇంతటి ప్రాముఖ్యత కలదు.

పూజ రెండు రకాలు. ఒకటి బాహ్యపూజ రెండు అంతర్ పూజ. పరిశుద్ధ భావనతో బాహ్యపూజ చేయగా చేయగా అంతర్ పూజయందు ఆసక్తి కలిగి అందు ఆ సాధకుడు ప్రవేశపెట్టబడతాడు. బాహ్యపూజయందు సాధకుడు తన ఎదురుగా ఓ దేవతా విగ్రహాన్నో లేక ఆ దేవతా యంత్రాన్నో ఏదేని ఒక ఛాయని పెట్టుకొని ధ్యానావహనాది ఉపచారాలతో పూజ చేస్తాడు. అదే అంతర్యాగంలో సాధకుడు తనలోనే ఆ దేవతను చిచ్ఛక్తిగా గుర్తించి తనయందే ఉపచారపూజలను ఆ దేవతకు చేస్తున్నట్టుగా భావిస్తూ కొన్నాళ్ళకి తనలో ఉన్న ఆ చిచ్ఛక్తి, తను వేరుకాదు అన్న భావనకు చేరుకుంటాడు. అది చాలా ఉన్నతమైన సాధన. అయితే కొంతమంది ఈ ఉన్నతమైన స్థితికి అంతర్యాగం మాత్రంచాలు బాహ్యపూజ అవసరంలేదు అది ఉత్త టైం వేస్ట్ పని అని ప్రచారం చేస్తున్నారు. బాహ్యపూజలో నిష్ణాతులు కానిదే అంతర్యాగం ఫలించదు. అది సత్యం. బాహ్యపూజను ఎంతో నియమంగా మనస్సుని ఏకాగ్రతో ఉంచి, ఎదురుగా తన ఉపాస్యదేవత ఉన్నట్టుగా భావించి చేయాలి. ఇటువంటి నియమ, నిగ్రహ, ఏకాగ్రతలు లేకుండా చేసే ఏ పూజైనా - బాహ్యమైనా, అంతర్యం అయినా ఉత్త టైం వేస్ట్ పనులే. అంతెందుకు, ఇప్పటికీ చాలా అంతర్యాగ నిష్ణాతులైన శంకరాచార్యపరంపర పీఠాధిపతులు కూడా బాహ్యపూజ చేస్తున్నారుకదా. విజ్ఞులు గుర్తించగలరు. కనుక బాహ్యపూజ చాలా ముఖ్యమైనది.

ఒక సాధకుడు అలా సాధనచేయగా అతడు ప్రాపంచిక బంధనాలనుండి విముఖుడయి అశాశ్వతమైన ఆనందాలను విడనాడి శాశ్వతమైన ఆనందసాగరంలో మునిగిపోతాడు. ఆత్మ సరిహద్ధులు లేనిదిగా గుర్తిస్తాడు. అదే బ్రహ్మమని తనకు బ్రహ్మకు భేదంలేదని గుర్తించి అహంబ్రహ్మాస్మి అన్న సత్యాన్ని తెలుసుకుంటాడు.

(అయిపోయింది)

4, జూన్ 2018, సోమవారం

అంతర్యాగ షోడషోపచార పూజ


అంతర్యాగ షోడషోపచార పూజ
(శ్రీగణపతిముని విరచిత ఉమాసహస్రం నుండి)

కావ్యకంఠ గణపతిమునిగారు ఆధునికకాలంలో ఎంతో ప్రసిద్ధిపొందిన మరియు సిద్ధిపొందిన ఉపాసకులు. భగవాన్ శ్రీరమణమహర్షిని లోకానికి పరిచయం చేసిన మహనీయులు. వారు రచించిన ఎన్నో గొప్ప రచనలలో ఉమాసహస్రం చాలా ప్రాశస్త్యమైనది. అందు వారు ప్రతిపాదించిన అంతర్యాగ షోడషోపచారపూజను సాధకుల సౌకర్యార్ధమై ఇచ్చట ఇస్తున్నాను. (ఇందు కొన్ని భావనలను శ్రీరమణాశ్రమువారు ప్రచురించిన ఉమాసహస్రమునుండి తీసుకొనబడినవి). అంతర్యాగమును సాధించుటకు ముందు సాధకులు బహిర్యాగములో నిష్ణాతులు కావలెను. ఔత్సాహికులు గమనించగలరు.

ఓం శ్రీగణాధిపతయే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీగురుస్సర్వకారణభూతాశక్తిః
1)   ధ్యానంః
కృతేన సా నిసర్గతో ధృతేన నిత్య మాననే।
సితేన శీతశైలజా స్మితేన శం తనోతు మే॥

(సహజసిద్ధమై సర్వదా ముఖమున ప్రకాశించు తెల్లని నవ్వుతో హిమాచలపుత్రియగు ఉమాదేవి నాకు శుభమును కలిగించుగాక)

ప్రతిక్షణం వినశ్వరా నయే! విసృజ్య గోచరాన్।
సమర్చయేశ్వరీం మనో! వివిచ్య విశ్వశాయినీమ్॥

(ఓ మనసా! అనుక్షణం నశించునట్టి శబ్దాది విషయములను విడిచిపెట్టి చిత్తవృత్తులను వేరు పరచి చిత్తవృత్తులకు, విషయములకు ఆధారముగానున్న చిద్రూపిణియగు పరమేశ్వరిని అర్చించుము)
2)   ఆవాహనంః
విశుద్ధదర్పణేన వా విధారితే హృదామ్బ మే।
అయి! ప్రయఛ్చ సన్నిధిం నిజే వపుష్యగాత్మజే॥

(అమ్మా! పార్వతీదేవీ! నా హృదయస్థానమునకు నిన్ను ఆహ్వానిస్తున్నాను. అనగా నా హృదయమున నీవు నిలువుమని అర్ధము)

3)   ఆసనంః
పురస్య మధ్య మాశ్రితం సితం య దస్తి పంకజం।
అజాణ్డమూల్య మస్తు తే సురార్చితే తవాసనం॥

(దేవతలచేత పూజించబడు ఓ మాతా! నా నిర్మలహృదయారవిందమును నీకు ఆసనముగా చేయుచున్నాను)

4)   పాద్యంః
 అఖణ్డధారయా ద్రవ న్నవేన్దుశేఖరప్రియే।
మదిఇయభక్తిజీవనం దధాతు తేఽమ్బ! పాద్యతాం॥

(అమ్మా! అవిచ్ఛన్నధారగా ప్రవహించు నా భక్తియే నీపాదారవిందములకు పాద్యమగుగాక)
   
5)   అర్ఘ్యం
వివాసనౌఘమానసప్రసాదతోయమమ్బ! మే।
సమస్తరాజ్ఞి హస్తయోరనర్ఘమర్ఘ్యమస్తుతే॥

(అమ్మా! సమస్తవాసనారహితమైన నా మనోనైర్మల్యమను జలము నీ చేతులకు అర్ఘ్యముగుగాక)

6)   ఆచమనీయంః

మహేంద్రయోనిచింతనాద్భవన్ భవస్య వల్లభే।
మహారసో రసస్త్వయా నిపీయతాం విశుద్ధయే॥

(శివుని ప్రేయసీ! ఇంద్రయోని ధ్యానమువలన స్రవించు అమృతరసమే నీకు ఆచమనీయము.)
(ఇంద్రయోని మానవ శరీరంలోని అంగుటి దగ్గర ఉండును. సాధకుడు తీవ్రమైన సాధన చేయగా చంద్రమండలమునుండి జాలువారు అమృతము ఈ ఇంద్రయోని ద్వారా స్రవించును. దీనినే అంతర్యాగ పూర్ణదీక్ష అని అందురు)

7)   అభిషేకంః

సహస్రపత్రపంకజద్రతత్సుధాజలేన సా।
సహస్రపత్రలోచనా పినాకినోభిషిచ్యతే॥

(పైవిధముగా స్రవించబడు అమృతధారతో నిన్ను అచిషేకించుదును)

8)   పంచామృత స్నానం

మమార్జితం యదింద్రియై స్సుఖం సుగాత్రి! పంచభిః।
తదంబ తుభ్య మర్పితం సుధాఖ్యపంచకాయతామ్॥
(అమ్మా! పంచేద్రియములచేత దర్శనాదులవలన నేను పొందిన సుఖము నీకు పంచామృతము అగుగాక)

9)   వస్త్రంః

వసిష్ఠగోత్రజన్మనా ద్విజేన నిర్మితం శివే।
ఇదం శరీర మేవ మే తవాస్తు దివ్య మంశుకం॥
(మంగళరూపిణీ! జననీ! ఈ నా దేహమే నీకు దివ్యవస్త్రము అగుగాక. ఇక్కడ సాధకుని శరీరమే అమ్మవారికి వస్త్రముగా భావించుకోవాలి.)

10)                ఉపపవీతంః

విచిత్రసూక్ష్మతన్తుభృ న్మమేయ మాత్మనాడికా।
సుఖప్రబోధవిగ్రహే మఖోపవీత మస్తుతే॥

(అమ్మా! కుండలిరూపమైన నిన్ను ఆసరాచేసుకున్న సుషుమ్నా నాడియే నీకు ఉపవీతము)

11)                చందనంః

మహద్విచిన్వతో మమ స్వకీయతత్త్వవిత్తిజమ్।
ఇదం తు చిత్త సౌరభం శివే తవాస్తు చందనమ్॥

(అమ్మా! ఆత్మతత్త్వజ్ఞానము వలన నా మనస్సుకు కలిగిన సువాసనయే నీకు చందనం)

12)                పుష్పార్చనః

మహేశనారి నిశ్స్వసన్ తథాయ ముచ్ఛ్వసన్ సదా।
తవానిశం సమర్చకో మమాస్తు జీవమారుతః ॥

(మహేశ్వరీ! ఉచ్ఛ్వాస నిశ్శ్వాసరూపమగు నా ప్రాణవాయువు నీకు పూజాపుష్పమగుగాక)

13)                ధూపంః

విపాకకాలపావకప్రదీప్తపుణ్యగుగ్గులుః।
సువాసనాఖ్యధూపభృద్భవ త్వయం మమాంబతే॥

(అమ్మా! నా పుణ్యపరిపాకమువలన కలిగిన నా చక్కని సంస్కారవిశేషములే నీకు ధూపమగుగాక)

14)                దీపంః

గుహావతారమౌనినా మయీశ్వరి ప్రదీపితా।
ఇయం ప్రబోధదీపికా ప్రమోదదాయికాస్తుతే॥

(అమ్మా! నాలో వెలిగిన జ్ఞానదీపమే నీకు దీపోపచారము)

15)                మహానైవేద్యముః

ఇమామయి ప్రియాత్ప్రియాం మహారసా మహంకృతిమ్।
నివేదయామి భుజ్యతా మియం త్వయా నిరామయే॥

( ఆరోగ్యస్వరూపిణీ అమ్మా! నా అహంకరమునే నీకు నైవేద్యముగా సమర్పించుచున్నాను)

16)                తాంబూలంః

సరస్వతీ సుధాయతే మనో దధాతి పూగతామ్।
హృదేవ పత్ర మంబికే త్రయం సమేత్యతేర్ప్యతే॥

(అమ్మా! నా వాక్కును సున్నముగా, మనస్సును పోకగా, హృదయమును తమలపాకుగా జేసి నీకు తాంబూలముగా సమర్పించుచున్నాను)

17)                నీరాజనం

వినీలతోయదాన్తరే విరాజమానవిగ్రహా।
నిజా విభూతి రస్తుతే తటిల్లతా ప్రకాశికా॥

(నా ఆజ్ఞాచక్రమున మెరుపుతీగవలే ప్రకాశించు వెలుగులే నీకు నీరాజనము)

18)                మంత్రపుష్పంః

స్వరోయ మన్తరంబికే ద్విరేఫవత్స్వరన్ సదా।
మమాభిమంత్ర్య ధీసుమం దదాతి దేవి తేంఘ్రియే॥

(అమ్మా! నాలోపల శుద్ధప్రాణరూపమైన స్వరము అవ్యక్తనాదమై నా బుద్ధియను పుష్పమును అభిమంత్రించి నీకు సమర్పించుచున్నాను)

19)                ఉద్వాసనం

తవార్చనం నిరంతరం యతో విధాతు మస్మ్యహం।
న విశ్వనాధపత్ని తే విసర్జనం విధీయతే॥

(అమ్మా! పార్వతీ! నేను అవిచ్చిన్నముగా నిన్ను అర్చించవలసి ఉన్నందున నీకు ఉద్వాసనము చెప్పుటలేదు. నిన్ను ఎల్లప్పుడూ నా హృదయమునందే నిలుపుకుందును అని భావం)

20)                ప్రార్ధనః

జడే ష్వివాలసే ష్వివ ప్రయోజనం న నిద్రయా।
విహర్తు మేవ యాచ్యసే హృదీశసద్మరాజ్ఞి మే॥

(అమ్మా! పరమేశ్వరీ। అజ్ఞానులందువలె, సోమరులందువలె నిద్రవలన ప్రయోజనములేదు. నా హృదయమునందు నీవు (ఎల్లప్పుడూ) సంచరించవలెనని ప్రార్ధిస్తున్నాను. సాధనచేయని వారు అజ్ఞానులు. వారియందు కుండలినీశక్తి జాగృతమవదు. సాధనవలన కుండలినీశక్తి జాగృతమవుతుంది. తత్ఫలితంగా ఆత్మస్వరూపము తెలుసుకొనదగును. అందువలనే పూజాఫలముగా అమ్మను నిరంతరము తన హృదయకమలమందు సంచరించమని సాధకుడు ప్రార్ధిస్తున్నాడు.)


3, జూన్ 2018, ఆదివారం

ESOTERIC OF SRIVIDYA

ESOTERIC OF SRIVIDYA

Spiritual Journey of a Common Man








Description of "ESOTERIC OF SRIVIDYA"
This book is about spiritual sadhana. How a mantra is to be practiced, how to overcome the hurdles during spiritual journey, what is the importance of a right guru etc.
In this book, practices of Srividya sadhana is dealt in a lucid way as a common man's story. Srividya samaya secrets are also discussed. There is no doubt that this book will guide all who wants to develop spiritually.

To get this book


30, మే 2018, బుధవారం

శిష్యులందు ఉత్తమ శిష్యులు వేరయా…


బ్రహ్మవిద్యయైన శ్రీవిద్యను నేర్చుకోవాలంటే ఎంతో పుణ్యఫలం ఉండాలి. ఇక్కడ నేర్చుకోవడం అని అనడం కన్నా ఉపాసించడం అనడం సరియైనదని నా అభిప్రాయం. అయినా నా అభిప్రాయాలతో చాలా మందికి అవసరం లేదులెండి.

నేనేదో గొప్ప ఉపాసకుడని కొంతమంది నా దగ్గరకు శ్రీవిద్యను నేర్చుకోవడానికి అప్పుడప్పుడు వస్తుంటారు. అలా వచ్చిన వారిని నేనడిగే ప్రశ్న ఒక్కటే. మీరు ఎందుకు శ్రీవిద్యను నేర్చుకోవాలనుకుంటున్నారని అడుగుతాను. చాలామంది ఇచ్చే సమాధానాలు ఇలా ఉంటాయి. అమ్మవారంటే చాలా ఇష్టమని, అమ్మవారంటే తమకు గొప్పభక్తిఅని, లలితాసహస్రనామాలు చాలా రోజులనుండి చదువుతున్నాము ఇప్పుడు ఇంకా బాగా కొత్తగా అమ్మవారి సేవ చేయాలనిపిస్తోందని, ఏమో ఎందుకో తెలీదుకాని మాకు ఈ విద్య నేర్చుకోవాలని చాలా బలంగా కోరికగా ఉందని, తమ భౌతికమైన/లౌకికమైన కోరికలు తీర్చుకోవడానికి ఈవిద్య ఒక రాజమార్గమని ఇలా రకరకాల సమాధానాలు ఇస్తుంటారు. ఇలాంటి సమాధానాలు విన్న, అలా చెప్పినవారిని చూసిన నాక్కొంచెం జాలిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవేవీ శ్రీవిద్యను ఉపాసించడానికి అర్హతను కలిగించవు.

సరే, అమ్మవారంటే భక్తి అని అంటున్నారు గనుక, వారిని నిరుత్సాహపరచడం ఇష్టం ఉండక వారికి శ్రీవిద్య అంటే ఏమిటో ప్రాధమిక (బేసిక్స్) అంశాలను వివరిస్తాను. వారంతా చాలా శ్రద్ధగా వింటున్నట్టు కనిపిస్తారు (నటిస్తారు). వారి దృష్టిమాత్రం ఈయన ఎప్పుడెప్పుడు మాకు మంత్రాలు ఇచ్చెస్తారా, మనం ఎప్పుడప్పుడు గొప్ప మంత్రవేత్తలమైపోతామా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఎక్కువ కాలం ఉపాసన చేయలేరని నాకనిపిస్తూనే ఉంటుంది. చాలా సందర్భాలలో అది నిజమైంది కూడా. నా సోది అంతా విన్న తర్వాత వారు ఈ విద్యకు పాటించవలసిన నియమాలేంటని అడుగుతారు. నీతి కలిగి ఉండాలి, సత్యమార్గాన్ని విడువకూడదు, నియమిత సురతమును మాత్రమే చేయాలి, ప్రతిరోజూ మంత్రసాధన చేయాలి, అమ్మవారికి పూజాదికాలు ప్రతిరోజూ చేయాలి, భోజనాదులకు సంబంధించిన నియమాలు పాటించాలి, మద్యము, మాంసము ముట్టకూడదు, స్త్రీల బహిష్టు నియమాలు పాటించాలి, ఆసమయమందు వారికి దూరంగా ఉండాలి, వారి చేతి వంట తినరాదు, త్రికాల సంధ్యావందనాదులు చెయ్యాలి, అతిముఖ్యంగా గురుభక్తి కలిగి ఉండాలి, గురుమాట జవదాటరాదు, గురువును తరచూ సంప్రదించి విద్యకు సంబంధించిన విషయాలను అడగి తెలుసుకుంటూ ఉండాలి, సాధనా సమయంలో ఏర్పడే కష్టనష్టాలకు గురువును గాని, దేవతను గాని బాధ్యులుగా చూడరాదు ఇలా మరికొన్ని నియమాలను చెప్పి అవి మీరు పాటించగలరా? అని అడగ్గానే వారు వెంటనే అన్నీ పాటించేస్తామని మరే ఆలోచనా లేకుండానే సమాధానమిచ్చేస్తారు. నేను ఊహించిన ఆ సమాధానం విన్న వెంటనే నాకు నవ్వువస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన ప్రాధమిక నియమాలను వారు పూర్తిగా అవగతం చేసుకోకుండానే వారు సమాధానం చెబుతారు కనుక.

సరే, నేను నా గుర్వాజ్ఞను అనుసరించి, వారికి విద్యను ఉపదేశించడానికి అంగీకరించి ఫలానా రోజున, ఫలానా టైంకు రమ్మని చెబితే వారు ఠంచనుగా చెప్పిన టైంకు ముందే వచ్చేస్తారు. దానికి కారణం వారి ఆతృత మాత్రమే. అది నేను గ్రహించినా వారు గ్రహించరు. ఆతృత అన్నడానికి కారణమేమిటంటే ఈ విద్యార్ధులను తర్వాత్తర్వాత ఎప్పుడైనా నవావరణ పూజకో లేకా మరియేదైనా పూజకో రమ్మని పిలిస్తే వారు తమకు తీరికలేదనో, లేదా పూజకు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఓ పది నిముషాలో, అరగంటో కూర్చొని మరిక టైం లేనట్టు వెళ్ళిపోతారు. ముందు రోజుల్లో ఉన్న ఆతృత తర్వాత రోజుల్లో ఉండదన్నది తిరుగులేని సత్యము. మంత్రోపదేశం తీసుకోవడానికి పది నిముషాలు పడుతుంది. అదే చక్రోపాసన నేర్చుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. ముందు బీరాలు పలికినట్టుగా వారు అంత సమయము వెచ్చించడానికి తయారుగా ఉండరు. కనుక చక్రపూజ నేర్చుకోవడమన్నది నత్త నడక నడుస్తుంది. ఇక వీరి మంత్రోపాసన ప్రహసనం చూద్దాం. మననాన్ త్రాయతి ఇతి మంత్రః అనునది శాస్త్రవచనం కదా. అనగా మననం చేయగా చేయగా అది ఆ సాధకుని రక్షిస్తుందని అర్ధము. మంత్రసాధన చేయగా చేయగా అది సిద్ధిస్తుంది. అది సిద్ధించాలంటే నిరంతరం మంత్రసాధన చెయ్యాలి. ఇక్కడే పెద్ద చిక్కు ఉంది. మంత్రోపదేశం పొందగానే వారు గురువుగారూ ఈ మంత్రాన్ని ఎన్ని సార్లు చదవాలి? అని అడుగుతారు. మంత్రాన్ని చదవడంకాదు, ఉపాసించాలని చెప్పి, శాస్త్రప్రకారం కనీసం 1008 సార్లు లేక, 300సార్లు లేక 108సార్లు చేయాలని చెబుతాను. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా నిజమైన కారణంచేత 108సార్లు కూడా కుదరకపోతే కనీసం పదిసార్లైనా ఉపాసించండి అని చెబుతుంటాను. వారు ముందువన్నీ ఒదలిపెట్టి చివరదైన పదిసార్లు పట్టుకొని రోజూ ఒక నిముషంపాటు ఏదో తూతూ మంత్రంగా ఆ మంత్రాన్ని అప్పచెప్పినట్టుగా చదివేసి హమ్మయ్య నేను సూపర్ సాధన చేసేస్తున్నానని గొప్పగా ఫీలైపోయి వెళ్ళి టి.వి. ముందో పనికిరాని వార్తాపత్రికముందో కూర్చొని కాలం వెళ్ళబుచ్చుతారు. నిజానికి ఒక మంత్రము సిద్ధించాలంటే ఆ మంత్ర సాధనా పద్ధతి తెలుసుకోవాలి. ప్రాధమిక స్థాయిలో ఏ విద్యార్ధికీ ఆ రహస్యాలు చెప్పబడవు. ఎందుకంటే వారు నిజంగానే పూర్తి నమ్మకంతో, గురుభక్తితో, గురువాక్యమందు విశ్వాసం ఉంచి మంత్రోపాసన చేస్తే కొన్నాళ్ళకి వారికి ఆ మంత్రరహస్యాలు తెలుసుకోవాలని మనసులో బలంగా అనిపిస్తుంది. అప్పుడు వారు గురువుదగ్గరకు పరిగెడుతారు. అప్పుడు మాత్రమే వారికి రహస్యాలు చెప్పబడుతాయి. అప్పటి నుండి వారి ఉపాసన ఫలించడానికి బీజం పడుతుంది. ఇలాంటి శిష్యులు ఎంతమంది ఉన్నారు?

కొంతమంది శిష్యులకు గురువుతో మాట్లాడడనికే తీరిక దొరకదు. ఇక ఆయన దర్శనానికి వారికి టైం ఎక్కడ ఉంటుంది. మరికొందరు గురువుతో విద్యకు సంబంధించిన విషయాలు తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతుంటారు. విద్యారహస్యాలను తెలుసుకోవడానికి మాత్రం ఆసక్తి చూపరు. మరికొందరు గురువు చెప్పిన ప్రాధమిక నియమాలను ఆచరణలో పెట్టలేక గురువుకు దూరమవుతారు. మరికొందరు గురువును ఊరకే పొగడుతూ అలాచేస్తే తమకేదో గురువు ఒరగపెట్టెస్తారన్న భ్రమలో కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. మరికొందరు గురువును కలవాలి కలవాలి అని అనుకుంటూనే ఉంటారు కాని వారికి అలా చేయడానికి సమయము, ధనము అందుబాటులో ఉండవు. మరికొందరు గురువుగారు ఇప్పుడు బిజీగా ఉంటారేమో, ఫోన్ చేస్తే ఏమైనా అనుకుంటారేమో… పోనీ ఇంకెప్పుడైనా మాట్లాడుదాములే అని వారంతటవారే గురువుగురించి ఊహించేసుకొని సమాధానపడిపోయి మాట్లాడుదామనే కార్యక్రమాన్ని వాయిదా వేసేస్తూ ఉంటారు. మరికొంతమంది ఘనులు గురువు ఫోన్ చేస్తే ఎంతసేపైనా మాట్లాడుతుంటారు కాని వారు మాత్రం తమంత తాము ఆయనికి అస్సలు ఫోన్ చేసి మాట్లాడరు. ఎందుకంటే ఫోన్ బిల్లు ఎక్కువైపోతుందని వారి భయం. తమ ఇటువంటి హిపోక్రటిక్ ప్రవర్తన ద్వారా వారు ఏమి సాధిస్తారు? ఇలా కొన్నాళ్ళు మంత్రాలను చదివి ఛట్…మంత్రాలకి చింతకాయలు రాలవు…ఇదంతా ఉత్త టైంవేస్ట్ పని అన్న భావనకు వచ్చేస్తారు.

డామిట్…ఉపాసన అడ్డం తిరిగింది…..


అందుకే శిష్యులందు ఉత్తమ శిష్యులు వేరయా…