సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, మే 2020, మంగళవారం

బ్రహ్మము అంటే ఏమిటి?


ఇంతకు ముందు మనం బ్రహ్మము గురించి వివేచన ఎప్పుడు కలుగుతుందో తెలుసుకున్నాము. ఆ వివేచన కలిగాక అసలు బ్రహ్మము అంటే ఏమిటి? అన్న ప్రశ్న ఉదయించక మానదు. కొంతమంది బ్రహ్మమును నిర్వచించలేము అని అంటుంటారు. నిర్వచనమే లేకపోతే  దానిని ఎలా తెలుసుకోవడం? తెలుసుకోలేకపోతే మోక్షము ఎలా కలుగుతుంది? అసలు బ్రహ్మమును ఎక్కడా నిర్వచించలేదా? అన్న విషయాలు విచారిస్తూ బ్రహ్మము అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిద్దాము.

దేనివలన ఈ జగత్తుకు జన్మ, స్థితి, లయములు కలుగుచున్నవో అదే బ్రహ్మము. అయితే ఈ జన్మ, స్థితి, లయ కార్యములు బ్రహ్మమునకు తటస్థ లక్షణములు. తటస్థ లక్షణము అనగా ఏదైనా లక్షణము (=charactaristic) ఒక వస్తువుకు దూరంగా ఉంటూ ఆ వస్తువును తెలుసుకోవడానికి ఉపకరిస్తూ ఉంటే అది తటస్థ లక్షణము.  జన్మ, స్థితి, లయ కార్యములు జగత్తు యొక్క లక్షణములు. ఇవి బ్రహ్మముతో ఎటువంటి సంబంధము కలిగి ఉండవు. కానీ జగత్తు యొక్క ఈ లక్షణములు కలగడానికి ఏదైతే కారణమో అదియే బ్రహ్మము. జగత్తు దేనివలన పుట్టుచున్నదో, దేనివలన పాలించబడుచున్నదో, దేనివలన లయమవుచున్నదో అదియే బ్రహ్మము. అందువలన ఆయా కార్యములు బ్రహ్మమునకు తటస్థ లక్షణములుగా చెప్పబడుచున్నవి.

"సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ" అనునది సాక్షాత్ వేదవాక్యం. ఇవి బ్రహ్మముయొక్క స్వరూప లక్షణములు. ఈ పదములకు వేరువేరుగా అర్ధములు ఉన్నా, బ్రహ్మము విషయంలో ఇవి ఒకే లక్షణాలుగా చూపబడుచున్నాయి. ఉదా: ఒకే వ్యక్తి తండ్రిగా, కొడుకుగా, భర్తగా వ్యవహరించబడడం.

కనుక బ్రహ్మమును అనుమానమాత్రంగా నిర్వచించలేదు. మన గ్రంథాలలో తటస్థ మరియు స్వరూప లక్షణాలుగా ప్రకటించబడినది. ఈ విధంగా బ్రహ్మమును గ్రంథాల (సద్గురువు) ద్వారా తెలుసుకొని (శ్రవణ), ఆలోచించి (మనన), ధ్యానం చేయగా (నిధిధ్యాసన) అంతర్బుద్ధి (వృత్తి) కలుగుతుంది. ఈ అంతర్బుద్ధి చిత్తమును శుద్ధిపరచును అనగా బ్రహ్మమును గురించిన అజ్ఞానమును తొలగించును. అప్పుడు స్వయంప్రకాశమైన బ్రహ్మము తెలియబడును.
ఇదియే "జన్మాద్యస్య యతః" అను బ్రహ్మసూత్రమునకు అర్ధము.   

25, మే 2020, సోమవారం

దశమహావిద్యల జయంతి పర్వదినములు



దశమహావిద్యల జయంతి పర్వదినములు ఈ క్రిందన పొందుపరచబడ్డాయి.
ఈ పర్వదినములు సంప్రదాయములను బట్టి మారవచ్చు. గమనించగలరు.

దశమహావిద్య
జయంతి రోజు    
ఈ సంవత్సరము తేది
శ్రీ తార
చైత్రశుద్ధ నవమి (శ్రీరామ నవమి)
02.04.2020
శ్రీ మాతంగి
వైశాఖ శుద్ధ తదియ
26.04.2020
శ్రీ బగళాముఖి
వైశాఖ శుద్ధ చతుర్ధి
27.04.2020
శ్రీ ఛిన్నమస్త
వైశాఖ శుద్ధ పౌర్ణమి
07.05.2020
శ్రీ ధూమావతి
జ్యేష్ఠ శుద్ధ చతుర్ధి
26.05.2020
శ్రీ భువనేశ్వరి
భాద్రపద శుద్ధ ద్వాదశి
30.08.2020
శ్రీ కాళీ
భాద్రపద కృష్ణ అష్టమి (అర్ధరాత్రి)
10.09.2020    
శ్రీ కమల
ఆశ్వీయుజ అమావస్య (దీపావళి అమావాస్య)
14.11.2020
శ్రీ త్రిపురభైరవి
మార్గశిర పౌర్ణమి
30.12.2020
శ్రీ లలిత (షోడశి)
మాఘ పౌర్ణమి
27.02.2021



22, మే 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 5


నారదపంచరాత్ర అనుసారము సమయాచారము

అన్ని కాలములందు బ్రాహ్మణుడు అందరియందు దయ కలిగిఉంటాడు. ఆ కారణమున అతడు ద్విజశ్రేష్ఠుడు, శాంతాత్ముడు, భగవన్మయుడు అవుతాడు. భావితాత్మా, సర్వజ్ఞ, శాస్త్రజ్ఞ, సదాచారనిష్ఠ, సిద్ధిత్రయ సమాయుక్త ద్విజుడు ఆచార్యునిగా అభిషిక్తుడవుతాడు. క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులందు క్షత్రియుడు అనుగ్రహము ఇవ్వడానికి సమర్ధుడు. క్షత్రియులందు గురుభావము కలిగితే వారు వైశ్యులను అనుగ్రహించరాదు. సజాతీయ శూద్రునకు గురుభావము కలిగితే శూద్రులకు అనుగ్రహ-అభిషేకములను చేయరాదు. వర్ణోత్తమ గురువు దేశవిదేశములందు విఖ్యాతుడయినను అనుగ్రహ-అభిషేకములను ప్రత్యేకంగా శుభార్ధులకు చెయ్యరాదు. అలా చేస్తే అది విపర్యయము (=దోషము) అవుతుంది. దానిద్వారా నాశనము పొందుతుంది.  అందువలననే శాస్త్ర విదిత కార్యములను మాత్రమే చెయ్యాలి. క్షత్ర, లంపట, శూద్ర జాతులకు ప్రతిలోమాను ప్రకారం దీక్షాప్రదానం చెయ్యాలి. అధికంగా భుజించువాడు, అలసుడు, విషయాలోలుడు, హేతువాది, దుష్టవాగ్వాది, గుణనిందకుడు, రోమరహితుడు, ఎక్కువ రోమములు కలవాడు, నిందితుడు, ఆశ్రమసేవకుడు, నల్లని దంతములు కలవాడు, తెల్లని పెదవులు కలవాడు, దుర్గంధమైన వాసన కలవాడు, దుష్టలక్షణములు కలవాడు, అధిక దానమునందు ఆసక్తుడైనవాడు - ఆచార్యుడు, స్వయం ఈశ్వరుడైననూ అతడు గురురూపముగా గ్రాహ్యుడు కాదు. ( = అటువంటి వారిని గురువుగా స్వీకరించకూడదు)

జ్ఞానోన్నయము

జ్ఞానోన్నయమునందు ఈవిధంగా చెప్పబడినది - తండ్రి నుండి, తాతనుండి ప్రాప్తించిన మంత్రము నిర్వీర్యమవుతుంది. హే మహేశ్వరీ! కనిష్ఠ సోదరుడు, వైరిపక్షాశ్రితుడు, భిక్షువు, వనవాసి - వీరినుండి భోగ-మోక్షములను కోరుకొను గృహస్థుడు మంత్రదీక్షను తీసుకోనరాదు.
త్యక్త్యాగ్ని (= అగ్నిహోత్రము చెయ్యనివాడు), క్రియాహీనుడు, పరిగ్రహ (=భార్య), వనములందు నివసించేవాడు, న్యూన (=క్రింది) జాతుల వారికి దీక్షను ఇచ్చే అధికారం లేదు.

భైరవీ తంత్రము ప్రకారము

తపస్వీ, సత్యవాది, గృహస్థ, స్వస్థమానస (తనయందుండువాడు), యతి - వీరికి వైఖానస (=సన్న్యాసికి సంబంధించినది; వానప్రస్థుడు; సన్న్యాసి) గురు అయ్యే యోగ్యత లేదు. వీరు గురువులుగా అయితే మోక్షార్ధి గృహస్థాశ్రమ వర్ణులకు ఉద్వేగం ప్రాప్తిస్తుంది.

కులార్ణవ ప్రకారము గురుశిష్య పరీక్ష
జ్ఞానము వలన గానీ, కృపచేత గాని గురువు శిష్యుని పరీక్షించాలి. ఆ పరీక్ష ఒక సంవత్సరము గానీ, ఆరు మాసములు గానీ, మూడు మాసములు గానీ ఉండాలి. ఉత్తమ-అధమ కార్యముల ద్వారా, నీచ, ఉచ్ఛ కర్మముల ద్వారా, ప్రాణ-ద్రవ్య ప్రదానాది కార్యములు కచ్చితంగా ఆదేశించి పరీక్ష చెయ్యాలి. మర్మవేధి వాక్యములద్వారా, మాయద్వారా, క్రూరచేష్టలద్వారా, పక్షపాత రహితంగా అనేక విధులచేత శిష్యుని పరీక్షించాలి. లాగికొట్టినా శిష్యుడు దుఃఖితుడు కాకపోతే అప్పుడు గురువు అతడియందు కృపను ప్రసరింప చెయ్యాలి. శ్రీగురు స్మరణము నందు, కీర్తనయందు, దర్శనమునందు, వందనమునందు, పరిచర్యమునందు, పిలిచినప్పుడు, పరిగెత్తునప్పుడు ఏ శిష్యునకు కంపనము, రోమాంచితము, స్వరనేత్రాదులు విప్పారునో ఆతడు శిష్య యోగ్యుడవుతాడు. దీక్షా సంస్కారమునకు యోగ్యుడవుతాడు. బోధించడం ద్వారా శిష్యునిగా చేసుకోవాలి. అన్యధా కూడదు.                    
శిష్యుడు కూడా గురువును ఈ క్రింది లక్షణములద్వారా గురువును పరీక్షించాలి. 
జపము, స్తోత్రము, హోమము, అర్చన కార్యములందు గురువు ఆనందంగా ఉన్నాడో లేదో చూడాలి. అతడికి జ్ఞానోపదేశ సమర్ధత ఉందో లేదో చూడాలి. మంత్రసిద్ధి ఉన్నదో లేదో చూడాలి.

కులార్ణవప్రకారము శిష్యుల స్థాయిలు

ఆది, మధ్యమ మరియు అంతము నందు భక్తి నిపాతము చేత యోగ్యతా జ్ఞానము కలుగుతుంది. ఈ విధముగా శిష్యుని యోక్క అధమ, మధ్యమ, ఉత్తమ్ స్థాయి తెలుసుకోవాలి. దీక్షాసమయమునందు భక్తి కలిగిన తర్వాత అది విఘ్నమయితే అతడిని ఆదిభక్తుడని అంటారు. జ్ఞాన-విజ్ఞాన-హీనులకు దీక్షా సమయమునందు భక్తి వలన జడత్వము నష్టమయితే దానిని మధ్య భక్తి అంటారు. ముందు భక్తి హీనత్వము ఉండి మధ్యన భక్తి కలిగినా లేకపోయినా అంతమునందు ప్రచుర భక్తి కలిగితే దానిని అంత భక్తి అంటారు.
                                                                                                                           ఇంకాఉంది     

15, మే 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 4


ప్రయోగసారము ప్రకారము సమయాచారము

దేవస్థానము, గురుస్థానము, శ్మశానము, నాలుగురోడ్ల కూడలి వీటికి దగ్గరలో మల-మూత్ర విసర్జన మరియు మైథునము చేయరాదు. దేవతా, గురు, గురుస్థానము, క్షేత్రము, క్షేత్రదేవత, సిద్ధ, సిద్ధదివస - వీటిముందు"శ్రీ" ను చేర్చి పలకాలి.

ప్రమత్త (తాగినమైకంలో ఉన్న స్త్రీ), అంత్యజా, కన్య, రజస్వల, పతితస్తని, కురూపి, జుట్టువిరబోసుకొని ఉన్న స్త్రీని నిందించరాదు. కన్యాయోని, పశుక్రీడ, నగ్నస్త్రీ, స్తనములను బహిర్పరచు స్త్రీని చూడరాదు. వేరేవాళ్ళ ధనమును, స్త్రీను గ్రహించకూడదు. ధాన్యము, ఆవు, గురువు, విప్రుడు, అగ్ని, విద్యా, కోశము, గృహము వీటికి ఎదురుగా కాళ్లుజాపరాదు మరియు వీటిని లంఘించరాదు. ఆలస్యము, మదము, సమ్మోహనము, మూర్ఖత్వము, ఈర్ష్య, ఆత్మస్తుతి, పరనింద, గొడవలు పడుట మొదలగునవి చేయరాదు. లింగధారులను, ధార్మికపరులను, విప్రులను, వేదములను, వేదాంగములను, సంహితములను, పురాణములను, ఆగమములను, శాస్త్రములను, కల్పమును (=పూజా పద్ధతి) ధూషించరాదు.

సుత్తి మొదలగు పనిముట్లు, జంతువులను కట్టడానికి ఉపయోగించే తాడు, వంటపొయ్యి, త్రాసు, వంటపాత్రలు, ధ్వజము, వైఢూర్యము, ఆయుధము, కలశము, చామరము, ఛత్రము, కంటిఅద్దములు, వస్త్రములు, భోగ యోగ్యమైన ఇతర ద్రవ్యములు, వస్తువులు, మహాస్థానమునకు చెందిన వస్తువులు, దేవాలయము, దివ్యమైన పదార్ధములు, భూతావిష్ట వస్తువులు మొదలగునవి దారియందు కనబడితే వాటిని దాట రాదు మరియు పాదముల చేత స్పర్శించరాదు. లోకాచార విరుద్ధమైన ఇష్టాగోష్ఠులు, వ్యక్తిగత ఆచార సంబంధమైన భాషా, పరహింసాత్మక భాష మొదలగునవి ఎల్లప్పుడూ చేయరాదు. తన భోగమునకు ఎల్లప్పుడూ దానమును స్వీకరించరాదు. దేవతా మరియు గురుపూజకు ప్రయత్నపూర్వకంగా ధనార్జన చెయ్యాలి. సత్యము, సౌశీలము, సమత, ధైర్యము, క్షాంతి, దయ మనస్సునందు ఉంటే దివ్యశక్తి ఎల్లప్పుడూ తేజరిల్లుతుంది. లిసోడా, అర్క, కరంజ వృక్షముల నీడనందు కూర్చోరాదు. కారణము, దేవతాదేవ శాస్త్రములను నిందించరాదు. గాడిద, గుర్రముల ధూళికి దూరంగా వెళ్ళాలి. గురు, శిష్య మరియు లింగ ఛాయలను లంఘించరాదు. గుర్వాజ్ఞను ఎల్లప్పుడూ ఉల్లంఘించరాదు. గురువుకు ఎదురు సమాధానము ఇవ్వరాదు. పగలు, రాత్రి గుర్వాజ్ఞను పాటించాలి. అసత్యమును, బహువాదమును, అశుభమును పరిత్యజించాలి. గురువు ముందర కామ, క్రోధ మరియు అప్రియ వచనములను ఎల్లప్పుడూ మాట్లాడరాదు. ధన, ధాన్య మరియు శ్రమకు సంబంధించిన అభిమానము వీడవలెను. గురుద్రవ్యములను ఎన్నడూ వాడరాదు. గురువు ఇచ్చిన వస్తువులను ప్రసాదంగా స్వీకరించాలి. ఏ వస్తువులను లోభంతో స్వీకరించరాదు.

గురువు ముందు అద్వైత దేవపూజ పరిత్యజించాలి. గురుపాదుకులకు, గురుచిత్ర పటము మొదలగు చిహ్నములకు సాదరముగా ప్రాణమము చెయ్యాలి, వాటిని లంఘించరాదు మరియు స్పర్శించరాదు. గురువు సన్నిధిలో మంచం మీద పడుకొనరాదు. పాదములను/కాళ్ళను జాపరాదు. వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు గురుపాదుకలకు నమస్కరించాలి. ఆయన ఛాయను లంఘించరాదు. ఆయన సమీపమునకు వెళ్లరాదు. గురువుకు ప్రణామము చేసిన తర్వాత మాత్రమే గురుగృహమునుండి బయటకు వెళ్ళాలి. గురువు ముందు శిష్యుని యొక్క గొప్పతనమును చెప్పుకోకూడదు. అహంకారము కలిగి ఉండరాదు. శరీరమున ఇనుపవస్తువులు ధరించరాదు. పరమగురు సన్నిధి యందు స్వగురువుకు ప్రణామము చేయరాదు. నమస్కారము కొరకు గురు దృష్టి నుండి తప్పించుకొనరాదు. గురువు మీద అభియోగము మోపరాదు. గురువును ఎన్నడూ "నువ్వు" అని ఏకవచన సంభోదన చెయ్యరాదు. ఉపయుక్తమైన (=తనకు తగిన) పరామంత్రము నందు దీక్షితుడైన తర్వాత గొడుగు, పావుకోళ్ళు, వస్త్రము మొదలగునవి దానము గ్రహించరాదు. పేదరికము మరియు ఆపదలయందు గురువునందు దోషము ఆపాదించరాదు. తన కులములో ఉన్న దీక్షితులైన ఆచార్యులనుండి ధనమును తీసుకోవడంలో ఎటువంటి దోషము లేదు. మంత్రోపభుక్త, అన్నాదులు, సంస్కృత యంత్ర మంత్రాదులు అధికముగా లభించిననూ వాటికి శిరస్సు వంచి ప్రణామము చెయ్యాలి. అడవుల యందు ఉరుకు జలపాతముల లాగ నీళ్ళను చిమ్మరాదు. ఆపద కాలమునందు, శపధము భంగపడు సమయమునందు కూడా గురు పేరును తెలుపరాదు (=గురువును ఆయా విషయములందు ఇరికించరాదు). ప్రమాదవశాత్తూ అలా జరిగితే ప్రాయశ్చిత్తార్ధం ప్రయత్నపూర్వకంగా పూజ-జప-హవనము చెయ్యాలి. తలపెట్టిన కార్యమును నిర్వహించలేనప్పుడు ప్రాయశ్చిత్తార్ధము దేవీ మంత్ర జపమును ఒక వెయ్యిసార్లు చెయ్యాలి. లోకఉద్వేకకారకము, మర్మఘాతి (కొట్లాట), స్థితిఉద్వేగకారి అయినటువంటి భాషణము చెయ్యరాదు. రమ్యమైన, మనఃపసంద, ఉజ్జ్వలమైన వస్త్రములను ధరించాలి. లోక విద్వేషణ కలిగించు వస్త్రములము ధరించరాదు. ఎవరైతే వారికి సంబంధించిన ఆచార-విచారములను పాటిస్తారో ఆ దీక్షితులకు శాంతి చేకూరుతుంది. స్త్రీలకు విశేషంగా నిర్మలమైన సమయాచారమును ఇవ్వవలెను. సమయాచారమును పాటించడం వలన శీఘ్రంగా సిద్ధిలభిస్తుంది. సమయాచారి ముఖమునందు మంత్రదేవత ప్రకటితమవుతుంది. సమయాచారికి అన్ని సిద్ధులూ కలుగుతాయి మరియు అంతమున మోక్షము కలుగుతుంది. అయన (=ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యకాలము), విషువ (= రేయి, పగలు సమానమైన కాలము. ఒక సంవత్సరములో రెండుసార్లు వస్తుంది. సాధారణంగా మార్చి20 మరియు సెప్టెంబరు22), చంద్రగ్రహణ, అష్టమీ, పూర్ణిమ రోజులందు నైమిత్తిక జపము చెయ్యాలి. నిత్యమూ మూడుసార్లు పూజ మరియు జపము చెయ్యాలి. న్యాయంగా సంపాదించిన సాధనములతో (వస్తువులు) దానము, హవనము, అర్చన చెయ్యాలి.

శివుడు చెబుచున్నాడు - హే ఈశ్వరీ! ఎవరు భక్తిపూర్వకంగా పై విధంగా చెయ్యరో వారు అధోఃగతి పాలవుదురు.
                                                                             ఇంకాఉంది...

8, మే 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 3

సమయాచారము

కులార్ణవము ప్రకారము శ్రీగురువునకు, కులశాస్త్రమునకు మరియు పూజ్య స్థానములకు భక్తిపూర్వకముగా "శ్రీ" ను జోడించి ప్రణామము చెయ్యాలి. ఉదా: శ్రీగురుపాదుకాం ప్రణమామి, శ్రీకులశాస్త్రం ప్రణమామి. బ్రహ్మనుండి కీటకము దాకా అన్నీ గురుసంతతి శిష్యులు. అందువలన పృధ్వీనందు ఎవరు పూజ్యులు కారు? జపకాలమునందు గురునాథుని నామమును ఉచ్చరించరాదు. గురుదేవుని  'శ్రీనాధదేవ' అని సంబోధిస్తూ మాట్లాడాలి. శ్రీగురుపాదుకా, ముద్రా, మూలమంత్రము, స్వపాదుక శిష్యునికి తప్ప వేరొకరికి చెప్పకూడదు. పరంపరా, ఆగమము, మంత్రము, ఆచారాదులు మొదలగునవి గురుముఖత ప్రాప్తమవుతేనే సఫలమవుతాయి. అన్యప్రకారముగా సఫలము చెందవు. శ్రీశాస్త్రఆశ్రయ శంభూత పుస్తకము దేవతతో సమానమవుతుంది. కులశాస్త్ర ప్రకారముగా భక్తితో వీటిని నిత్యమూ పూజించాలి. ఆ పుస్తకము పశువల వంటివారికి ఇవ్వకూడదు. తన భార్యతో సమానముగా కులశాస్త్రమునకు సేవ చెయ్యాలి. అన్ని పశుశాస్త్రములను పరస్త్రీ సమానముగా భావించాలి. ద్విజోత్తములకు స్వపచమైయన పాలు ఏవిధంగా తాగడానికి పనికిరావో అదేవిధంగా పశుముఖం నుండి వచ్చిన శ్రుతుల సమ్మతము కాని ధర్మమును కౌలికుడు పాటించరాదు. శాస్త్రానుసారము కులాచారమును ఎవరు చెబుతారో ఎవరు వింటారో వారు యోగినీ మరియు వీరులకు గ్రాసమవుతారు. శాస్త్రములందు కులధర్మము యొక్క వర్ణన శ్రద్ధారహితమయితే ఆశాస్త్రము ప్రళయము వచ్చునంతవరకు నరకమునకు పోయినా సరే వదలిపెట్టదు. ఎవరైతే వివాహిత స్త్రీయందు ప్రీతి కలిగి ఉంటారో వారు మూల్య విహీనులై ఆమెతో సంభోగమునకు త్వరగా తయారవుతారు.

గురుసామానులైన స్త్రీలు అయిదు రకములు: నల్లని వస్త్రములు ధరించిన స్త్రీ, నల్లని వర్ణముగలస్త్రీ, కుమారీ, సన్నని నడుము గల స్త్రీ, మనోహరమైన స్త్రీ - వీరిని దేవతా బుద్ధి చేత అర్చించాలి.

పచ్చి మాంసము, సురాకుంభము, మదమెక్కిన ఏనుగు, సిద్ధలింగము, సహకారము (=?), అశోక (=?), ఆటలాడుకుంటున్న కుమారీలు, ఏకవృక్షము, శ్మశానము, నారీసమూహము మరియు రక్తవస్త్రములు ధరించిన స్త్రీలను చూసిన వెంటనే ప్రణామము చెయ్యాలి. గురుశక్తి, జ్యేష్ఠ-కనిష్ఠ పుత్రుడు, కులదేశిక, కులదర్శన శాస్త్ర, కులద్రవ్య, కౌలిక, ప్రేరక, సూచక, వాచక, దర్శక, శిక్షక, బోధిక, యోగీ-యోగినీ, సిద్ధపురుష, కన్యా, కుమార, నగ్నమత్తనారి వీరిని నిందించకూడదు, ద్వేషించకూడదు. నవ్వులాటకైనా వారిని అవమానపరచకూడదు. కులయోగులకు అప్రియమైన అబద్ధము ఎన్నడూ చెప్పరాదు. కురూపి మరియు అత్యంత నల్లని స్త్రీని కులస్త్రీగా ఉంచరాదు. నగ్న, ఉన్మత్త, ఆచ్ఛాదనలేని స్తనముగల స్త్రీని చూడరాదు. పగటిపూట స్త్రీ సంభోగము చేయరాదు, యోనిని చూడరాదు.

ప్రపంచమందున్న స్త్రీలందరూ మాతృకుల సంభవులు. నూరు తప్పులు చేసినప్పటికీ స్త్రీలను పువ్వులతోనైనా కొట్టరాదు. స్త్రీదోషములను గణించరాదు. వారి గుణములను ప్రకాశింపచెయ్యాలి. కులవృక్షములందు కులయోగినులు ఉంటారు కనుక ఆ వృక్షముల ఆకులు తినరాదు. విశేషించి అర్కపత్రమును (జిల్లేడాకు)ను తినరాదు. కులవృక్షముల కింద శయనించరాదు, ఎటువంటి ఉపద్రవములు చెయ్యరాదు. కులవృక్షములను చూసిన వెంటనే భక్తిసహిత ప్రణామము చెయ్యాలి. వాటిని ఎన్నడూ నరకరాదు. కులవృక్షములు తొమ్మిది. అవి - లిసోడా (నక్కెర), కరంజ (= పులిగోరచెట్టు), వేప, రావి, కదంబ, మారేడు, మర్రి, మేడి, జిల్లేడు.

దేవత-గురు-శాస్త్ర-సిద్ధాచారములను నిందించేవాడు, విద్యాచోరుడు, గురుద్రోహి బ్రహ్మరాక్షసుడవుతాడు. మోహం చేత గురువును అందరిముందు లోకువ చేసేవాడు, వీరపురుషులను నిందించేవాడు, కులశాస్త్రములను వక్రించేవాడు (అటూ ఇటూ తనకనుకూలంగా మార్చుకోవడం) వీరందరూ కూడా బ్రహ్మరాక్షసులవుతారు. ఏకాక్షర మంత్రాన్నిచ్చే గురువును ఎవరు విశ్వసించరో వారు నూరు కుక్క జన్మలెత్తిన తర్వాత చండాలజన్మ ఎత్తుతారు. బుద్ధిమంతులు గురువును గురించి ప్రచారం చేస్తారు. కానీ మంత్రమును మాత్రము బహిర్గతము చేయరాదు. రహస్యంగా ఆ పని చేసినచో సంపదలు మరియు ఆయుష్షు క్షీణించును. కులధర్మాన్ని, ఆచారాన్ని ఎవరు పాటించరో వారు మహాపాపి అవుతారు.

యోగినులు ప్రకోపిస్తే ఆపద, రోగము, దరిద్రము, కలహము, అడుగడుగుకి స్కలనమవడం వంటివి జరుగుతాయి. అతడు మానహీనుడు, ప్రణష్టుడు (= గుర్తింపు పోయినవాడు), తేజహీనుడు, అతిదుఃఖితుడు, నిందితుడు, తిరస్కరించబడినవాడు, విహ్వలుడు (భయపడినవాడు,స్వాధీనము తప్పినవాడు), సంఘవర్జితుడు అవుతాడు. దేశదేశాంతరాలు పోయినా కూడా అతని కార్యములన్నింటియందు హాని కలుగుతుంది. శ్రీదేవి నుండి వరము పొందినవాడు కూడా కులమార్గము నందున్న కులపాలికలు, సాకినిలు అతడిని భక్షిస్తాయి. సదాచారవంతుడు దేవీ మరియు యోగినులకు ప్రియభక్తుడవుతాడు. సదాచారమునందు దేవీ మరియు యోగినులు కలసిఉంటారు. కౌలికాచారమునకు విరుద్ధంగా పయనిస్తే నీచయోనిలందు జన్మిస్తారు. సంస్కార విహీనుడయినా, గురువాక్యమును ఉల్లంఘించినా, ఆచారమును దాటవేసినా కౌలికుడు పతితుడవుతాడు. నిత్య, నైమిత్తిక, కామ్య, మంత్ర, తంత్రాది విషయములందు లోపము జరిగితే ఆ సాధకుడు అనర్హుడు, పశువు, దుఃఖితుడు అవుతాడు. మంత్ర సాంకర్యము (=సంకరం) కూడా అవుతుంది. జ్ఞానాజ్ఞాన విషయములందు రహస్యములు బహిర్గతమవుతుంటాయి. ఈ ప్రకారమైన దోషముల వలన చిన్న, పెద్ద పాపములు తగులుకుంటాయి. దేశ, కాల, వయ, విత్తముల చేత జ్ఞాన ప్రాప్తికొరకు యధావిధి ప్రాయశ్చిత్తము చేసి గురువు అన్ని పాపములనుండి విముక్తి కలిగిస్తారు. శిష్యుడు కూడా చెప్పబడిన ప్రాయశ్చిత్తములు చెయ్యాలి. గురునామ స్మరణ చెయ్యాలి. బంగారము యొక్క మాలిన్యము ప్రాయశ్చిత్తమైతేనే అగ్ని యందు దగ్ధమవుతుంది.

శివుడు పార్వతితో చెబుతున్నాడు. ఓ పార్వతీ! ఇక్కడ ఎక్కువ చెప్పవలసిన అవసరం ఏమున్నది? అసలు రహస్యం చెబుతాను విను. వర్ణాశ్రమం యొక్క అన్ని ఆచారములూ సద్గతి ప్రదాయకములు. హే కులనాయకీ! గురువునుండి మూడుసార్లు ఆచారమును విని, శిష్యుడు అది పాటించకపోతే ఆ పాపమును గురువుకూడా పోగొట్టలేరు. ఏవిధంగా మంత్రి పాపము రాజుకు, పత్నీ పాపము పతికి సంక్రమిస్తాయో అదేవిధంగా శిష్యుని పాపము గురువుకు సంక్రమిస్తుంది.
          ఇంకాఉంది

2, మే 2020, శనివారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 2



ఏదైనా మంత్రమును వింటే గుర్వాజ్ఞాను సారముగా దానిని గ్రహించాలి. గురువుకు ఇష్టములేని వాటిని వదిలిపెట్టాలి. గురువు ద్వారా నేర్చిన శాస్త్ర రహస్యాలను ఎవ్వరికీ చెప్పకూడదు. అలాఎవరైతే చెబుతాడో అతడు సమయచ్యుతుడు అవుతాడు. ఇందు ఎంతమాత్రమూ సంశయము లేదు. నిత్యమూ సాధకుడు తనను తన గురు రూపముగానే భావించుకోవాలి. ఇందు ద్వైతభావన చేయరాదు.

అన్ని జీవుల యొక్క కళ్యాణము (=శుభమును) ఆత్మనందు భావించాలి. ఆత్మనందున్న దేవికి భక్తి భావనతో శుశ్రూష చేసినట్టుగా భావించుకోవాలి. మహాత్మ అయిన గురుదేవునికి చేసిన గురుశుశ్రూష దేవీ కృపారూపమవుతుంది. భక్తి సహిత గురుశుశ్రూష వలన సకల కోరికలూ తీరుతాయి. సమస్త పాపములూ క్షయమవుతాయి మరియు పుణ్యరాశి వృద్ధి చెందుతుంది. గురు శుశ్రూష వలన సమస్త కార్యములూ సిద్ధిపొందుతాయి. మీకు ఇష్టమైన వస్తువులందు గురు హితమును మరువరాదు. గురుదేవుని పూజించువాని పుణ్యము గణించశక్యము కానిది. తన శక్తి కొలది ఎవరైతే కొంచెమైనా, ఎక్కువైనా గురుశుశ్రూష చేస్తారో వారి దరిద్రము పోయి ధనవంతులవుతారు. భక్తి రహితముగా గురువుకు ఏమి ఇచ్చినా అది నిష్ఫలమవుతుంది. ఫలము కలగడానికి భక్తి మాత్రమే కారణము. గురుద్రవ్యములందు ఆకాంక్ష చూపరాదు. గురువుకు ఏదైతే అధిక ఇష్టమో దానిని గురువుకు సమర్పించాలి. లోభ, మోహ కారణంగా అలా చేయకపోతే ఆ శిష్యుడు 73 నరకములందు దుఃఖములను అనుభవిస్తాడు. మాంసాదులను భక్షించువారు నీచయోనులందు పుడతారు. గురు ద్రవ్యములందు అభిలాష కలవాడు, గురుపత్నియందు కోరిక కలవాడునకు కలిగెడు అత్యంత పాపమును పోగొట్టుటకు ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు. గురు ఆజ్ఞను పాటించనివాడిని, గురువునకు అప్రియమైన కార్యములు చేసేవాడిని, గురు ధనమును తీసుకున్నవాడిని మహాపాతకుడుగా, గురుద్రోహిగా భావించాలి. తన ధనమును గురువుకు నివేదన చేయకుండా ఎవడు ఖర్చు చేస్తాడో వాడు బ్రహ్మఘాతకుడవుతాడు. గురుస్థానమునకు, సంప్రదాయమునకు, ధర్మమునకు ఎవరు నష్టము కలిగింతురో వారు గురువునుండి బహిష్కృతుడయి దండించడానికి మరియు వధించడానికి యోగ్యుడవుతాడు.

గురు శాపానికి/కోపానికి మించిన నాశనము, గురుద్రోహానికి మించిన పాపము మారియొకటి లేదు. గురునిందని మించిన మృత్యువు కూడా లేదు. గురువుకు నచ్చని దానిని మించిన ఆపద లేదు. మనుష్యులు అగ్నియందు ప్రవేశించవలసి వచ్చినప్పుడు గాని మృత్యు సముఖమున ఉన్నప్పుడుగానీ గురువుకు అపరాధము చేయరాదు. ఎక్కడైతే గురునింద జరుగుతుందో అక్కడ నుండి సాధకుడు తన చెవులు మూసుకొని గురునింద వినబడనంత దూరం వెళ్లిపోవాలి. గురునింద చెవినపడిన వెంటనే గురునామ జంపము మొదలు పెట్టాలి. గురువు మిత్రులను, సుహృదయులను, దాసీ జనులను అవమానపరచరాదు. వేదము, శాస్త్రము, ఆగమముల అనుసారము జీవించే వారిని నిందించరాదు. శ్రీగురుపాదుకలు, వస్త్రము మరియు నామముల స్మరణ కూడా జపమే అవుతుంది. గుర్వాజ్ఞను పాటించడం శిష్యుని కర్తవ్యం. గురుసేవ భజనతో సమానము. గురువు నివాస స్థలమును చూసిన వెంటనే శాంతి చిత్తుడయి, వాహనము, వ్యంజనము (నోట్లో ఏదేని నములుతున్నది - తాంబూలము మొదలగునవి), పాదుకలు, ఛత్రము, చామరాము మొదలగునవి వదలి గురునివాస ప్రవేశము చెయ్యాలి. గురుదేవుని వాహనము, పాదుకలు, ఛత్రము, ఆసనము మొదలగువాటికి నమస్కరించాలి. వాటిని స్వయంగా ఎప్పుడూ వాడరాదు. పాద ప్రక్షాళణ, స్నానము, అభ్యంగము (=తలంటుట), దంతధావనము, మూత్రత్యాగము, శౌచము, క్షురము, శయనము, స్త్రీసేవనము, వీరాసనము, దుర్వాక్యము పలుకుట, ఆసనము, హాస్యము, రోదనము, కేశమోచనము, నగ్నత్వం, పాదప్రసరణము, వాద-కలహ-ధూషణములు, అంగభంగాంగ వాద్యములు, చేతులు చరచుట, చేతులు చాచుట, ద్యూతము, మల్లాది యుద్ధములు మొదలగునవి గురు-యోగి-మహాసిద్ధపీఠ క్షేత్రములు, ఆశ్రములందు చేయరాదు. మోహవశమున అలా ఎవరైనా చేస్తే వారికి దేవత శాపమిచ్చును. ఉపచారములకు తప్ప గురుసమీపమునకు పోరాదు మరియు అతని అనుజ్ఞ లేనిదే అతని సమీపమున కూర్చోరాదు. గురుముఖమును చూస్తూ ఉండి అతని వచనానుసారము కార్యమును చెయ్యాలి. గురువు చెప్పిన కార్యములను ఉపేక్షించరాదు. గురువు ఏమి చెప్పిన (సత్ లేదా అసత్) నిస్సంకోచంగా పాటించవలెను. నిగ్రహ-అనుగ్రహాలు ఏమైనా గురువే కారణము. గురుముఖంగా ఏమి పలుకునో అది శాస్త్రమే అవుతుంది. గురుకార్యమును స్వయంగా పూర్తిచెయ్యాలి. వేరొకరికి అప్పచెప్పరాదు. కదలడం, కూర్చోవడం, పడుకోవడం, మాట్లాడడం, హోమము-పూజలు చెయ్యడం అన్నింటయందు గుర్వాజ్ఞను పాటించాలి. అవి తెలిసినా గుర్వాజ్ఞానుసారమే చెయ్యాలి. జాతి, విద్యా, ధనము మొదలగు అభిమానములు వీడాలి. గురు సన్నిధియందు శిష్యుడు ఎల్లప్పుడూ సేవ చెయ్యాలి. భూమి మీద గురు ఛాయకు కూడా దూరంగా ఉండాలి మరియు వినమ్రతతో, భక్తితో ఉండాలి. గురువు మనస్సు ప్రకారం గురుకార్యము చెయ్యాలి. గురువు పార్శ్వమునందుండి వినమ్రత, ప్రఛ్చన్నత కలిగి మితభాషిగా ఉండాలి. గురువాక్యమును అనాదరిస్తే అతడు రౌరవాది నరకములకు పోతాడు. ఆవు, బ్రాహ్మణహత్య వలన ఎటువంటి పాపము కలుగుతుందో గురువు దగ్గర అసత్యమాడితే అంతటి పాపము కలుగుతుంది. గురువునుండి దూరముగా వెళ్లినప్పుడు, ఆర్ధిక ఇబ్బందులున్నప్పుడు, విషమ స్థితులందప్పుడు కూడా గురువును విస్మరించరాదు. గుర్వాదేశాను సారము అతని ఆశ్రమమునందుండాలి. శక్తిఛాయ, గురుఛాయ మరియు దేవఛాయలను లంఘించరాదు. వాటిమీద శిష్యుని ఛాయకూడా పడకూడదు. గురువుకు దగ్గరగా పడుకొనరాదు. గుర్వాదేశము లేకుండా భాషణము, పఠనము, గానము, భోజనము, నిద్రవంటివి చేయరాదు. గుర్వాజ్ఞాపాలనాసరముగా వంద బ్రహ్మ హత్యలైనా చెయ్యవలెను. గుర్వాజ్ఞాలేకుండా నిస్స్వాస కూడా చేయరాదు. గురువుకు ప్రణామము చేసి చేతులు జోడించి కూర్చోవాలి. గురువు, గురు సమానులైన శ్రేష్ఠులు, దేవతా సన్నిధినందు ఆసనము మీద కూర్చోరాదు. గురువుకు సింహాసనము, జ్యేష్ఠులకు ఉత్తమ ఆసనము, కనిష్ఠులకు దేశ్యాసనము ఇతరాలకు సమాసనము ఇవ్వాలి.

ఏ శిష్యుడు జాతివలనగాని, విద్యావలన గానీ ధనవంతుడైతే ఆ శిష్యుడు గురువును చూసిన వెంటనే దూరమునుండైన దండప్రణామములు గావించి మూడు లేదా ఆరు లేదా పన్నెండు సార్లు ప్రదక్షిణాలు చెయ్యాలి. జ్యేష్ఠులకు ఒకసారి ప్రదక్షిణ చెయ్యాలి. గురువు, పరమగురువు ఒకేచోట ఉంటే ముందు పరమగురువుకు ఆ తర్వాత స్వగురువుకు ప్రణామము చెయ్యాలి. పూజ్యులకు కృతాఞ్జలి ప్రణామము, ఇతరులకు వాక్య వందనము చెయ్యాలి. దేవతలకు, గురువులకు, కులాచార్యులకు, జ్ఞానవృద్ధులకు, తపోధనులకు, విద్యాధికులకు, స్వకర్మ స్థానమునకు మరియు కులనాయికకు ప్రణామము చెయ్యాలి. స్త్రీ ద్వేషులకు గురుశాపము కలుగుతుంది. శఠులకు, పాశండులకు, పతితలకు, వికర్ములకు, కృతఘ్నులకు మరియు ఆశ్రమవాసులు కానివారకు ప్రణామము చేయరాదు. ఒకే గృహమునందున్నప్పుడు గురువుకు నివేదించకుండా ఎవరైతే భోజనము చేస్తారో వారు పంది యోనియందు జన్మిస్తారు. ఒకే గ్రామమునందు గురుశిష్యులు ఉన్నట్టయితే ఆ శిష్యుడు మూడు సంధ్యలందు గురువుకు ప్రణామము చెయ్యాలి. ఒక క్రోసు దూరములో ఉంటే ప్రతిదినము, రెండు క్రోసుల దూరములో ఉంటే అయిదు పర్వములందు (=?) గురువుకు ప్రణామము చెయ్యాలి. ఒక యోజనము నుండి పన్నెండు యోజనముల దూరంలో శిష్యుడు ఉంటే ఆ యోజనముల సంఖ్యను (ఆ సంఖ్యా మాసము) బట్టి గురువు దగ్గరకు వెళ్ళి ప్రణామము చెయ్యాలి. ఉదాహరణ: ఒక యోజన దూరములో ఉంటే ఒకటవ మాసంలో, రెండు యోజనముల దూరంలో ఉంటే రెండవ మాసంలో....... అలా పన్నెండు యోజనముల దూరంలో ఉంటే సంవత్సరానికి ఒక మారు గురువు దగ్గరకు వెళ్ళి ప్రణామము చెయ్యాలి. దూరము, దేశము, స్థితి శిష్యుని భక్తిని బట్టి గురు సాన్నిధ్యము లభిస్తుంది. అత్యంత దూరంలో ఉన్న శిష్యుడు అతని అవకాశమును బట్టి చెయ్యవచ్చు. దేవతా మరియు గురువు దగ్గరకు ఖాళీ చేతులతో వెళ్లరాదు. ఫల, పుష్ప, వస్త్రాదులు యథాశక్తి సమర్పించాలి. ఓ దేవీ! ఎవరు ఈ ప్రకారముగా ఆచరించరో వారు బ్రహ్మ రాక్షసులవుతారు. గురుపత్నీ, పుత్రులు, పెద్దఅన్నయ్య గురువుతో సమానులు. జ్యేష్ఠులు నలుగురు. వారు స్వజ్యేష్ఠుడు, క్రమజ్యేష్ఠుడు, కులజ్యేష్ఠుడు, గురుజ్యేష్ఠుడు. జ్యేష్ఠునికి ప్రణామము చేయవలసిన విషయమై ఇక్కడ క్రమజేష్ఠుని ప్రాప్తిపాదించెను. గురువుకు, కులవృద్ధులకు విధానపరంగా వందనము చేయవలెను. పితా, మాతా మొదలగు పూజ్యులకు బంధువుల సమక్షమున లేచి ప్రణామము చేస్తే వ్యక్తము, అవ్యక్తము అయినటువంటి దోషముల ప్రభావము తగ్గుతాయి. పశువులు (శఠ, పాషండ మొద...) ప్రణామము చేస్తే చేసిన వారిని మహాపశువులంటారు. వారికి దేవతా శాపము కలుగుతుంది. ఎవరికైతే గురుస్థానము లభిస్తుందో వారి పాదుకలు కూడా గురువులవుతాయి. వీరికి జ్యేష్ఠ వందనములు వర్తించవు.
                                                                                   ఇంకాఉంది